Narendra Modi: నిజంగా చౌకీదార్ అయితే నా కొడుకును తెచ్చివ్వండి: మోదీని నిలదీసిన ఓ విద్యార్థి తల్లి

  • జేఎన్ యూ విద్యార్థి మూడేళ్ల క్రితం అదృశ్యం
  • ఇప్పటికీ ఆచూకీలేని వైనం
  • "నేను చౌకీదార్" అన్న ప్రధానిపై విద్యార్థి తల్లి మండిపాటు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ట్విట్టర్ అకౌంట్ లో పేరు చౌకీదార్ నరేంద్ర మోదీగా మార్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, మూడేళ్ల కిందట ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జేఎన్ యూ) విద్యార్థి నజీబ్ అదృశ్యం కాగా ఇప్పటివరకు ఆచూకీ దొరకలేదు. ఈ నేపథ్యంలో, నజీబ్ తల్లి ఫాతిమా నఫీస్ ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు.

 "మీరు చౌకీదార్ అని చెప్పుకుంటున్నారు. మీరు నిజంగా దేశానికి కాపలాదారు అయితే నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి. అతడిని తెచ్చివ్వండి. నా కొడుకు అదృశ్యానికి కారణమైన ఏబీవీపీ గూండాలను ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదో చెప్పండి! నా బిడ్డ ఆచూకీ కనుక్కోవడంలో మూడు అత్యున్నత దర్యాప్తు సంస్థలు కూడా విఫలం అయ్యాయి.. ఎందుకు?" అంటూ నిలదీశారు.

అప్పట్లో నజీబ్ జేఎన్ యూ హాస్టల్ నుంచి అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. అతడు కనిపించకుండా పోవడానికి ముందు ఏబీవీపీ కార్యకర్తలతో గొడవపడినట్టు వార్తలొచ్చాయి. 2016లో నజీబ్ తల్లి ఫాతిమా ఏబీవీపీ సభ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకు నజీబ్ ఎక్కడున్నాడో కూడా తెలియలేదు.

More Telugu News