Telugudesam: లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి సెన్సార్ బోర్డు బ్రేక్... ఎన్నికలయ్యాక విడుదల చేసుకోండంటూ ఆదేశాలు

  • సినిమా రిలీజ్ ఆపేయండి
  • సెన్సార్ బోర్డు ఆదేశం
  • న్యాయపోరాటానికి సిద్ధమేనంటూ వర్మ ట్వీట్

టైటిల్ ప్రకటించినప్పటి నుంచే వివాదాస్పదమైన లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో ఈ సినిమా విడుదలపై నిర్ణయం తీసుకున్నట్టు సెన్సార్ బోర్డు వర్గాలు తెలిపాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ఎన్నికల సమయంలో రిలీజైతే టీడీపీకి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ దేవీబాబు అనే టీడీపీ కార్యకర్త ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎన్నికల సంఘం సెన్సార్ బోర్డుకు పలు సూచనలు చేసింది.

ఈ నేపథ్యంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రబృందానికి సెన్సార్ బోర్డు నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎన్నికలు పూర్తయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ సెన్సార్ వర్గాలు సూచించాయి. దీనిపై స్పందించిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ న్యాయపోరాటం చేస్తానంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి గల కారణాలు, ఆమె ప్రవేశించిన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో వచ్చిన మార్పులు లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ప్రధాన ఇతివృత్తం. 

More Telugu News