Andhra Pradesh: జనసేన పార్టీలో చేరిన జేడీ లక్ష్మీనారాయణ.. పవన్ కల్యాణ్ పై ప్రశంసల వర్షం!

  • ప్రజాసేవ చేసేందుకు పవన్ వచ్చారు
  • డబ్బులు లేకుండా రాజకీయం చేసే అవకాశమొచ్చింది
  • పవన్ నాయకత్వంలో పనిచేస్తా

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఈరోజు జనసేన పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పిన పవన్ కల్యాణ్.. జేడీని సాదరంగా జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. భారీగా డబ్బులు వెచ్చించకుండా రాజకీయాల్లో గెలవలేమన్న అభిప్రాయం ప్రస్తుతం నెలకొని ఉందని తెలిపారు. డబ్బులు లేకుండానే రాజకీయం చేయొచ్చని నిరూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఓ ప్రొఫెసర్ లో జ్ఞానం ఉంటుందనీ, మరికొందరిలో ఆత్మ విశ్వాసం ఉంటుందని లక్ష్మీనారాయణ తెలిపారు. ఇంకొందరు వ్యక్తులకు జనాదరణ ఉంటుందని అన్నారు. ఈ మూడు లక్షణాలను పవన్ కల్యాణ్ పుణికిపుచ్చుకున్నారని ప్రశంసలు కురిపించారు.

సినీపరిశ్రమలో బ్రహ్మాండంగా నగదు సంపాదించుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాసేవ చేసేందుకు దాన్ని పవన్ వదులుకున్నారని చెప్పారు. పవన్ మార్గదర్శకత్వంలో ముందుకు వెళుతూ ప్రజల ఆశలు, ఆకాంక్షలను నెరవేరుస్తామని ధీమా వ్యక్తం చేశారు. చివరగా దేశాన్ని మారుద్దాం.. జనసేన అంటే ఏంటో చూపిద్దాం.. జైహింద్ అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.

More Telugu News