Nallari Kirankumar Reddy: 'ఈ సారికి మీ ఇష్టం'... సన్నిహితులతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తాత్వికం!

  • కాంగ్రెస్ లో కనిపించని ఎన్నికల సందడి
  • ఇప్పటికే టీడీపీ తరఫున బరిలో ఉన్న నల్లారి సోదరుడు
  • ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని కిరణ్ కుమార్ నిర్ణయం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ఆఖరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. నామినేషన్ల దాఖలుకు సమయం దగ్గరపడినా, కాంగ్రెస్ టికెట్లు కావాలని ఏ నేతా ముందుకు రాకపోవడం, ఆసలు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల సందడే కనిపించకపోవడం, పార్టీ కార్యాలయాలన్నీ బోసిపోయి కనిపిస్తుండటం, తన సోదరుడు నల్లారి కిశోర్ కుమార్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలో ఉండటంతో ఆయన ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు సమాచారం.

 నల్లారి కుటుంబానికి చాలా సంవత్సరాలుగా అండగా ఉన్న కార్యకర్తల్లో కొందరు కిశోర్ తో పాటు టీడీపీలోకి వెళ్లిపోగా, వెళ్లలేకుండా కిరణ్ కుమార్ తో ఉన్న వారు, నియోజకవర్గ రాజకీయాలు, ఎన్నికల గురించి ప్రస్తావించిన వేళ, ఆయన తాత్విక సమాధానం చెప్పినట్టు సమాచారం. "ఈ సారికి మీ ఇష్టం" అని ఆయన తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ స్నేహపూర్వకంగా ఉండటం కూడా కిరణ్ కు నచ్చలేదని ఆయన అనుచరులు అంటున్నారు.

More Telugu News