Sai Praneet: సంచలనం సృష్టించిన తెలుగుతేజం సాయి ప్రణీత్!

  • వరల్డ్ నంబర్ 4 చెన్ లాంగ్ పై ఘన విజయం
  • 21-18, 21-13 తేడాతో విజయం 
  • స్విస్ ఓపెన్ సెమీస్ లో తెలుగుతేజం

వరల్డ్ నంబర్ 4పై బ్యాడ్మింటన్ ఆటగాడు, చైనాకు చెందిన చెన్ లాంగ్ పై భారత యువ కెరటం సాయి ప్రణీత్ అనూహ్య విజయం సాధించాడు. స్విస్‌ బ్యాడ్మింటన్‌ ఓపెన్‌ టోర్నీలో భాగంగా జరిగిన పోటీలో క్వార్టర్ ఫైనల్స్ లో చెన్ పై తలపడిన అన్ సీడెడ్ ప్రణీత్, 21-18, 21-13తో విజయం సాధించాడు. ఈ టోర్నీలో చెన్ లాంగ్ రెండో సీడ్‌ గా బరిలోకి దిగడం గమనార్హం. హోరాహోరీగా సాగిన తొలి గేమ్‌ లో సగభాగం వరకూ వెనుకబడిన ప్రణీత్‌, ఆపై ప్రత్యర్థి స్కోరును సమం చేసి, ఆ వెంటనే తనదైన ఆటతీరుతో 19-15తో ఆధిక్యం పొందాడు. ఆపై లాంగ్ అతనికి చేరువకు వచ్చినా, తొలి సెట్ ను గెలుపొందిన ప్రణీత్, అదే ఉత్సాహంతో రెండో సెట్ నూ సొంతం చేసుకున్నాడు.

కాగా, ఇదే టోర్నీలో మహిళల డబుల్స్‌ క్వార్టర్స్‌ లో సిక్కి-అశ్విని జోడీని 17-21, 17-21తో జపాన్ కు చెందిన మట్సుయామా-చిహరు జోడీ చేతిలో పరాజయం పొందారు. మిక్స్ డ్‌ డబుల్స్‌ క్వార్టర్ ఫైనల్స్ పోరులో అర్జున్‌-మనీషాల జోడీని 19-21, 16-21తో డెన్మార్క్ కు చెందిన మతియాస్‌-సోబె జంట ఓడించింది. పురుషుల డబుల్స్‌ క్వార్టర్ ఫైనల్స్ విభాగంలో ప్రణవ్‌ చోప్రా-చిరాగ్‌ శెట్టి జంట 11-21, 26-28 తేడాతో మార్కస్‌ ఎలిస్‌-క్రిస్‌ లాంగ్రిడ్జ్‌ (ఇంగ్లాండ్‌) జోడీ చేతిలో ఓటమిని చవిచూసింది.

More Telugu News