mangalagiri: మంగళగిరిని మరో గచ్చిబౌలిగా తీర్చిదిద్దుతా: నారా లోకేశ్

  • మంగళగిరికి ఎన్నో ఐటీ  పరిశ్రమలు తీసుకొచ్చా
  • ప్రజల కలలు సాకారం చేసే ఎన్నికలు
  • మోదీ-జగన్ జోడీ చాలా బాగా నడుస్తోంది

గుంటూరు జిల్లాలోని మంగళగిరిని మరో గచ్చిబౌలిగా తీర్చిదిద్దుతానని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా చిర్రావూరులో లోకేశ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, మంగళగిరికి ఎన్నో ఐటీ  పరిశ్రమలను తీసుకొచ్చానని అన్నారు. రాష్ట్ర ప్రజల కలలు సాకారం చేసే గొప్ప అవకాశం ఈ ఎన్నికల ద్వారా వారికి లభిస్తుందని, ఈ సంకల్పంతోనే బాలాజీ ఆశీస్సులు తీసుకుని ప్రచారం మొదలు పెట్టామని అన్నారు.

మోదీ-జగన్ జోడీ చాలా బాగా నడుస్తోందని, కేసీఆర్ తో కలిసి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. కేంద్రంలో మోదీ రావాలన్నదే కేసీఆర్, జగన్ కోరిక అని, మోదీ మళ్లీ అధికారంలోకొస్తే కేసుల నుంచి బయటపడవచ్చన్నది జగన్ ఆలోచనని అభిప్రాయపడ్డారు. జగన్ ఉండేది హైదరాబాద్ లోనూ, పోటీ చేసేది మాత్రం ఆంధ్రాలోనని విమర్శించారు. ఆంధ్రాకు రావాలి, అమరావతిలో ఉండాలన్న ఆలోచన జగన్ లో లేదని, జగన్ ఎన్ని నాటకాలు ఆడినా అధికారంలోకి రాలేరని అన్నారు. భావి ప్రధాని ఎవరో టీడీపీ నిర్ణయించబోతోందని వ్యాఖ్యానించారు. 

More Telugu News