aadala: ఆదాల పచ్చిమోసగాడని ప్రతి ఒక్కరూ చెబుతారు: సోమిరెడ్డి

  • ఇలాంటి స్వార్థపరులు టీడీపీని వీడినా నష్టమేమీ లేదు
  • అవకాశవాదులకు ప్రజలు బుద్ధి చెబుతారు
  • టీడీపీ అభ్యర్థులు గెలిస్తే రౌడీయిజం తగ్గుతుంది

నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీని వీడి వైసీపీలో చేరడంపై ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పనులన్నీ చక్కబెట్టుకుని ఆదాల వెళ్లిపోతాడని జిల్లాలో అందరికీ తెలుసని, ఆయన పచ్చిమోసగాడని ప్రతి ఒక్కరూ చెబుతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం టీడీపీకు పట్టుగొమ్మ అని, నెల్లూరు గ్రామీణంలో టీడీపీ గెలుపు, జిల్లా అభివృద్ధికి మలుపు అని వ్యాఖ్యానించారు. నెల్లూరులో నిజాయతీపరుడికి, మోసగాడికి మధ్య పోటీ జరగబోతోందని, ఆదాల లాంటి అవకాశవాదులకు జిల్లా ప్రజలు బుద్ధి చెబుతారని, నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు గెలిస్తే రౌడీయిజం తగ్గుతుందని అన్నారు. ఆదాల లాంటి స్వార్థపరులు ఎంతమంది పార్టీని వీడినా టీడీపీకి నష్టమేమీ లేదని అభిప్రాయపడ్డారు. 

More Telugu News