Prudhvi Raj: సూసైడ్ చేసుకున్నానని పోలీసులు కూడా ఇంటికి వచ్చారు: నటుడు పృధ్వీ

  • తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చా
  • సూసైడ్ చేసుకున్నానన్న మాటను చూపించారు
  • అంతా ఒకటే ఫోన్లు
  • మలేషియా నుంచి కూడా ఫోన్ వచ్చింది

‘పెళ్లి’ సినిమాతో చాలా పాప్యులర్ అయిన నటుడు ప‌ృధ్వీరాజ్. ఆయన తండ్రి సినిమా అవకాశాల కోసం చాలా ప్రయత్నించారట. కానీ కళ్లు బాగోలేవని రిజెక్ట్ చేసేవారట. పృధ్వీకి మాత్రం అనుకోకుండా డైరెక్టర్ బాలచందర్ రూపంలో అవకాశం వెదుక్కుంటూ వచ్చింది. ఆ తరువాత దాదాపు 200 సినిమాల్లో నటించారు. అయితే ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన పూర్తి విషయాన్ని చూపించకుండా ‘అవును నేను సూసైడ్ చేసుకున్నా’ అన్న మాటను మాత్రం చూపించారట. ఇంకేముంది, పోలీసులు కూడా వచ్చి తన ఇంటి తలుపు తట్టారట. ఈ విషయాన్ని ఆయన ఓ టీవీ షోలో గుర్తు చేసుకున్నారు.

‘‘గతంలో ఒక తమిళ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చెప్పిన కథ మొత్తం చూపించకుండా ‘అవును సూసైడ్‌ చేసుకున్నా’ అన్న మాట మాత్రమే టీవీలో చూపించారు. దాంతో ఈ వార్తలు మరిన్ని పెరిగాయి. అసలు ఏం జరిగిందంటే.. సూసైడ్‌పై నేను ఒక షార్ట్‌ ఫిలిం చేశా. అది చూసి నిజంగా నేను సూసైడ్‌ చేసుకున్నానని.. ఏకంగా పోలీసులు కూడా ఇంటికి వచ్చారు.

నాకూ, ఇంటికీ అందరూ ఒకటే ఫోన్లు. మలేషియా నుంచి కూడా ఒకమ్మాయి ఫోన్‌ చేసింది. ‘సర్‌ మీరు సూసైడ్‌ చేసుకున్నారా’ అనడిగితే అవునమ్మా అన్నా. ‘సర్‌ దయ చేసి ఆత్మహత్య చేసుకోవద్దు’ అని చెబుతూ.. ‘అవునూ, మీరు సూసైడ్‌ చేసుకుంటే ఎలా మాట్లాడుతున్నారు’ అని ఆశ్చర్యపోయింది. ఇక్కడ స్వర్గంలో వైఫై ఫ్రీగా పెట్టారు అనేసరికి ఠక్కున ఫోన్‌ పెట్టేసింది’’ అని తెలిపారు.  

More Telugu News