Andhra Pradesh: నంద్యాల టికెట్ ఇవ్వాల్సిందే.. లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తా!: భూమా బ్రహ్మానందరెడ్డి హెచ్చరిక

  • ఈసారి నంద్యాల అసెంబ్లీ సీటు నాదే
  • ఈ విషయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు
  • బాబు ఫొటో పెట్టుకుని ప్రచారానికి పోతా

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే 126 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అభ్యర్థిగా అఖిలప్రియను ప్రకటించిన చంద్రబాబు.. నంద్యాల టికెట్ ను పెండింగ్ లో పెట్టారు. ఈ నేపథ్యంలో భూమా బ్రహ్మానంద రెడ్డి ఈరోజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు తన మద్దతుదారులు, అనుచరులతో బ్రహ్మానందరెడ్డి నంద్యాలలో అత్యవసరంగా భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి నంద్యాల అసెంబ్లీ టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ టికెట్ పై చంద్రబాబు తనకు ఇప్పటికే హామీ ఇచ్చారని వ్యాఖ్యానించారు. ఒకవేళ నంద్యాల టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేస్తానని హెచ్చరించారు. భూమా నాగిరెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు ఫొటోలతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని స్పష్టం చేశారు.

కాగా, నంద్యాల టికెట్ ను తనకే ఇవ్వాలని ఏవీ సుబ్బారెడ్డి, తన అల్లుడికి ఇవ్వాలని ఎస్పీవై రెడ్డి చంద్రబాబును గట్టిగా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు ఏం నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

More Telugu News