Andhra Pradesh: తెలుగుదేశం పార్టీకి ఓటేశాం.. అందుకే రాజారెడ్డి హత్యకేసులో ఇరికించారు!: సుధాకర్ రెడ్డి

  • అప్పులపాలయ్యాం.. మాది నిరుపేద కుటుంబం
  • నేను పులివెందులకు కూడా పోను
  • దయచేసి మమ్మల్ని లక్ష్యంగా చేసుకోవద్దు

తమ కుటుంబం టీడీపీ అభిమానులమనీ, ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ఓట్లేశామని వైఎస్ రాజారెడ్డి హత్యకేసులో జైలుశిక్ష అనుభవించి, ఇటీవల విడుదలైన సుధాకర్ రెడ్డి తెలిపారు. ఆ కక్షతోనే తనను అప్పట్లో రాజారెడ్డి హత్యకేసులో అన్యాయంగా ఇరికించారని ఆవేదన వ్యక్తం చేశాడు. జైలు నుంచి బయటకొచ్చిన అనంతరం పొలాలను చదును చేసి అరటిపంట సాగుచేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం రూ.9 లక్షలు అప్పు చేశానని అన్నారు.

దయచేసి తమను లక్ష్యంగా చేసుకోవద్దనీ, తమది నిరుపేద కుటుంబమని వ్యాఖ్యానించారు. మీడియా మిత్రులు కూడా తమను ఇబ్బంది పెట్టకుండా దూరంగా ఉండాలని కోరారు. నిజాలు రాస్తే ఎలాంటి ఇబ్బంది లేదనీ, మీడియా నిజాలు రాయాలని సూచించారు.

తాను అసలు పులివెందులకు కూడా పోననీ, తన కుమారుడికి ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఇటీవల రాఘవరెడ్డి ఆసుపత్రికి పోయి చూపించుకుని వచ్చానని చెప్పారు. తన జీవితం నాశనమైపోయిందనీ, ఇప్పుడు అప్పుల్లో చిక్కుకున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News