YS Viveka: వినాశకాలం వచ్చింది కాబట్టే వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు: సతీష్ రెడ్డి

  • ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారు
  • జనాలేం పిచ్చోళ్లు కాదు
  • ఏది చెబితే అది నమ్మరు
  • ప్రజల చేతిలో పరాభవం తప్పదు

వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై పులివెందుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సతీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వినాశకాలం వచ్చింది కాబట్టే వైసీపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనతోపాటు చంద్రబాబు, లోకేశ్, ఆదినారాయణరెడ్డిపై చేసిన ఆరోపణలకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. వైసీపీ నేతలు ఏది చెబితే అది నమ్మేయడానికి.. జనాలేం పిచ్చోళ్లు కాదన్నారు.

పులివెందులలో చిన్న బిడ్డ నుంచి కాటికి కాళ్లు చాచిన వాళ్ల వరకూ అందరికీ.. హత్యలు చేసే అలవాటు ఎవరికుందో తెలుసన్నారు. ఎదుటి వ్యక్తిపై ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలని సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి ఆరోపణల వల్ల పులివెందుల ప్రజల చేతిలో పరాభవం తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వివేకా హత్య వెనుక అసలు సూత్రధారులెవరో త్వరలోనే బయటపడుతుందని సతీష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ హత్యపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News