jagan: లోటస్ పాండ్ నుంచి వైయస్ వివేకానందరెడ్డి కన్నీళ్లు పెట్టుకుని వచ్చిన మాట నిజమా? కాదా?: బుద్ధా వెంకన్న

  • లోటస్ పాండ్ లోపల ఏం జరిగిందో జగన్ చెప్పాలి
  • వివేకా హత్య ఆషామాషీ వ్యవహారం కాదు
  • సినిమా ఫక్కీలో ప్లాన్ వేశారు

సొంత బాబాయ్ వివేకా చనిపోతే... తెలంగాణ పోలీసులతో వైసీపీ అధినేత జగన్ చర్చలు జరుపుతూ కూర్చున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వివేకా హత్యతో సానుభూతి ఓట్లను పొందాలనేది వారి దుష్ట ఆలోచన అని అన్నారు. ఈ హత్య వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మునిగిపోతున్న నావలా ఉన్న వైసీపీని బతికించడానికి సినిమా ఫక్కీలో ప్లాన్ వేశారని అన్నారు. ఈ హత్యా రాజకీయాలను ప్రజలెవరూ హర్షించరని చెప్పారు.

ప్రజా ధనాన్ని జగన్ లూఠీ చేస్తారనే ఇప్పటి వరకు అందరూ అనుకున్నారని... కానీ, సొంత బాబాయిని చంపేసి, దాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటారని ఎవరూ అనుకోలేదని వెంకన్న అన్నారు. నిన్న కాక మొన్న లోటస్ పాండ్ నుంచి వివేకానందరెడ్డి కళ్లలో నీళ్లు పెట్టుకుని, కారు ఎక్కిన మాట నిజమా? కాదా? అని ప్రశ్నించారు. లోటస్ పాండ్ లోపల ఏం జరిగిందో చెప్పాల్సిన అవసరం జగన్ పై ఉందని అన్నారు.

వివేకా హత్య ఆషామాషీ వ్యవహారం కాదని.. రెండు సార్లు ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ, రాష్ట్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైయస్ సోదరుడు అయిన వివేకా హత్యకు గురికావడం సాధారణ విషయం కాదని చెప్పారు. ఈ హత్యను ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుందని తెలిపారు. ఈ హత్య వెనుక ఉన్న నిజానిజాలను పోలీసులు బట్టబయలు చేస్తారని చెప్పారు.

More Telugu News