YS Viveka: తానేం చూశాడు, అసలేం జరిగింది: వివేకా మృతిపై పీఏ కృష్ణారెడ్డి!

  • ఇంటి సైడ్ లో డోర్ తెరచివుంది
  • ఆయన్ను లేపవద్దని సౌభాగ్యమ్మ చెప్పారు
  • వేచి చూసి లోపలికి వెళితే రక్తపు మడుగులో వివేకా
  • అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు

ఈ తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి మృతిచెందగా, తాను చూసిన ఘటనలు, పోలీసులకు ఫిర్యాదు చేయడం వెనుక కారణాన్ని ఆయన పీఏ కృష్ణారెడ్డి మీడియాకు వివరించారు.

"ఆయన ఉన్నా లేకున్నా నేను అక్కడే ఉంటా. కానీ నిన్న పెద్దాయన అప్పటికింకా లేవలే. నేను బయట పేపర్ చూస్తా కూసుండేసినా... హాపెనవర్ తరువాత సౌభాగ్యమ్మగారికి ఫోన్ చేసినా. సార్ ఇంకా లేవలేదమ్మా... లేపాల్నా వద్దని చెప్పేసి. అంటే... నైట్ లేట్ గా వచ్చినట్టుంది... లేపద్దులే అంది. మళ్లా వెయిట్ చేశా. ఈలోపు ఇంట్లో పనిచేసే లచ్చమ్మ, లచ్చమ్మ కొడుకు వచ్చినారు. వాళ్లు వస్తే కూడా కొద్దిసేపు బయటే ఉండండి. సార్ ఇంకా లేవలేదు అని చెప్పినా.

 తరువాత నేనే వెళ్లి లేపమని చెప్పినా. బ్యాక్ సైడ్ డోర్ ఉంటది. డోర్ కొడితే లేస్తాడు. లేపమ్మా అని చెప్పినా... లేయడం లేదు సారూ అని వచ్చిందామె. మళ్లా నేనూ పోయినా. నేను పోయి పిలిస్తే కూడా పలకలా. సరే గాఢ నిద్రలో ఉన్నాడేమో. మెలకువ వచ్చినప్పుడు లేస్తాడేమోలే అని నేనూ బయటకు వచ్చినా. మెయిన్ డోర్ క్లోజ్ లోనే ఉంది. అక్కడ సైడ్ డోర్ ఓపెన్ లో ఉంది అని, పక్కన పార్క్ లో పనిచేసే రంగన్న అనే ముసలాయన వచ్చి చెప్పినాడు.

అప్పుడు నేను, లచ్చమ్మ కొడుకు ప్రకాష్, ఇద్దరమూ ఒకేసారి లోపలికి పోయినాము. పోతే, బెడ్ రూమ్ కూడా ఓపెన్ లోనే ఉంది... డోర్. ఏసీ కూడా ఆన్ లోనే ఉంది. పక్కన్నే రెండు లీటర్ల వరకూ బ్లడ్ పడిపోయి ఉంది. కానీ సార్ లేడు అక్కడ. ఏంరా? అని జెప్పి మేమూ బాత్ రూములోకి పోయినాము. అక్కడ బ్లడ్ లో అంతా మునిగిపోయి ఉన్నాడు. చేయి పట్టుకోని చూశా. చేయి పట్టుకుంటే స్పర్శ నాడి లేదు. ఇమ్మీడియట్ గా సౌభాగ్యమ్మ గారికి, వాళ్ల అల్లుడు రాజశేఖర్ గారికీ చెప్పినా" అని అన్నారు.

సైడ్ గేట్ తీసి వుండటమే తమకు డౌట్ వచ్చేలా చేసిందని, రాత్రి తలుపులు మూసి వెళ్లామని, అటువైపు తాము వెళ్లేది లేదని కృష్ణారెడ్డి అన్నారు. తలపై ముందు, వెనుక, అరచేతిలో గాయాలు ఉన్నాయని, ఆ విషయంలో ఎంక్వైరీ చేయాలని ఫిర్యాదు చేశానని అన్నారు.

More Telugu News