Sheila Dikshit: ఉగ్రవాదం విషయంలో మోదీనే బెటర్.. మన్మోహన్‌ది మెతక వైఖరి: కాంగ్రెస్‌ను దిగ్భ్రాంతికి గురిచేసిన షీలా దీక్షిత్ వ్యాఖ్యలు

  • తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్న షీలా
  • తాను అలా అనలేదని వివరణ
  • ఇదంతా మోదీ పోల్ గిమ్మిక్కేనని చెప్పానన్న మాజీ సీఎం

కాంగ్రెస్ సీనియర్ నేత, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ సొంతపార్టీని దిగ్భ్రాంతికి గురిచేసే వ్యాఖ్యలు చేశారు. ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు షీలా సమాధానం చెబుతూ, ‘‘అవును నిజమే. మీతో ఏకీభవిస్తున్నా. ఉగ్రవాదంపై పోరు విషయంలో మాజీ ప్రధాని మన్మోహన్ ఉదాసీన వైఖరి అవలంబించారు. ఆయన మోదీ అంత కఠినమైన వ్యక్తీ కాదు.. ఆయనంత దృఢ సంకల్పమూ లేదు. అయితే, మోదీ ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమే చేస్తున్నట్టు నాకు అనిపిస్తోంది’’ అని షీలా దీక్షిత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. షీలా చేసిన ఈ వ్యాఖ్యలను పాత్రికేయుడు విర్ సంఘ్వీ ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు.

షీలా వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే కలకలం రేగడంతో వెంటనే ఆమె స్పందించారు. ఇంటర్వ్యూలో తాను చేసిన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ట్వీట్ చేశారు. ఉగ్రవాదం విషయంలో మోదీ చాలా కఠినంగా వ్యవహరిస్తారని అనుకుంటున్నారని, కానీ అదంతా ఎలక్షన్ కోసం గిమ్మిక్కు తప్ప మరేమీ కాదని మాత్రమే తాను ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చానని ట్విట్టర్లో వివరించారు.

More Telugu News