Andhra Pradesh: వైసీపీలో పితాని సత్యనారాయణ చేరుతారంటూ వార్తలు.. ఘాటుగా స్పందించిన ఏపీ మంత్రి!

  • నేను వైసీపీలో చేరుతానని దుష్ప్రచారం చేస్తున్నారు
  • నిస్సిగ్గుగా వ్యతిరేక కథనాలు రాస్తున్నారు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

తాను టీడీపీ నుంచి వైసీపీలోకి వెళుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ వాపోయారు. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదనీ, తాను టీడీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. నిస్సిగ్గుగా తనపై వ్యతిరేక కథనాలు రాస్తున్న వార్తాపత్రికల తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అమరావతిలో ఈరోజు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పితాని మాట్లాడారు.

ప్రజాజీవితంలో తనకు ఓ వ్యక్తిత్వం ఉందని పితాని సత్యానారాయణ తెలిపారు. ఏపీకి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తానని రెండేళ్ల క్రితమే చెప్పి పార్టీకి రాజీనామా చేశానని గుర్తుచేశారు. చంద్రబాబు లాంటి అనుభవం కలిగిన నేత అవసరం రాష్ట్రానికి ఉందన్న ఉద్దేశంతోనే తాను టీడీపీలో చేరానని వ్యాఖ్యానించారు.

టీడీపీ తనను ఆదరించిందనీ, గౌరవించిందని అన్నారు. అడ్డదిడ్డంగా పార్టీ మారే కల్చర్ తమది కాదని స్పష్టం చేశారు. తాను ఏ పాత్రికేయ మిత్రుడికి వ్యతిరేకంగా విమర్శలు చేయడం లేదనీ, కొందరు వ్యక్తులు రాస్తున్న తప్పుడు కథనాలకు వ్యతిరేకంగానే మాట్లాడుతున్నానని అన్నారు. 

More Telugu News