Andhra Pradesh: టీడీపీలో చేరిన యడం బాలాజీకి ఎమ్మెల్సీ అవకాశం.. చంద్రబాబు హామీ

  • కేసీఆర్ భయపెట్టి గెలిచారు
  • బాలాజీని జగన్ మోసం చేశారు
  • గంటా విషయంలో గాలి వార్తలు ప్రచారం

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేత యడం బాలాజీకి ఎమ్మెల్సీ అవకాశం కల్పించనున్నట్టు ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం పొద్దుపోయాక వైసీపీ నేత వంగవీటి రాధాకృష్ణతో కలిసి బాలాజీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోమారు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి చేయకుండానే భయపెట్టి గెలిచారని ఆరోపించారు. కేసీఆర్ చేతుల్లో జగన్ బందీ అయ్యారని, కుట్ర రాజకీయాలు చేస్తే ఎవరినీ వదిలిపెట్టబోనని హెచ్చరించారు. దుష్ట శక్తుల నుంచి ఏపీని ఒక్క టీడీపీ మాత్రమే కాపాడగలదన్నారు. గంటా వైసీపీలో చేరుతున్నారంటూ గాలి వార్తలు పుట్టించడం మంచిది కాదన్నారు. ప్రవాసాంధ్రుడైన బాలాజీనీ జగన్ మోసం చేశారని, ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని పునరుద్ఘాటించారు. అలాగే, వంగవీటి రాధాకృష్ణకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.

More Telugu News