Telangana: లోక్ సభ ఎన్నికల్లో నాలుగు చోట్ల పోటీచేస్తాం.. మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇస్తాం!: కోదండరాం

  • ఖరారైన కరీంగనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి
  • మరో సీటుపై నేతలతో చర్చించాక తుది నిర్ణయం
  • మీడియాతో మాట్లాడిన టీజేఎస్ అధినేత

తెలంగాణ జనసమితి(టీజేఎస్) అధినేత కోదండరాం ఈరోజు కీలక ప్రకటన చేశారు. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి నాలుగు స్థానాల్లో పోటీచేస్తామని కోదండరాం ప్రకటించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్‌గిరి లోక్ సభ నియోజకవర్గాల్లో పోటీచేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. మిగిలిన ఒక స్థానంపై పార్టీ నేతలతో విస్తృతంగా చర్చించిన అనంతరం ఓ అభిప్రాయానికి వస్తామని అన్నారు. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో కోదండరాం మాట్లాడారు.

తెలంగాణ జనసమితి పోటీచేయని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని కోదండరాం పేర్కొన్నారు. ఆదివాసీల భూములను కాపాడేందుకు ‘ఆదివాసీ హక్కుల రక్షణ’ పేరుతో బస్సు యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. భద్రాచలం నుంచి ఈ నెల 16న ప్రారంభం కానున్న ఈ యాత్ర.. మరుసటి రోజు మేడారంలో ముగుస్తుందని కోదండరాం ప్రకటించారు.

More Telugu News