Karnataka: మరదలిపై అత్యాచారం చేసిన బావ.. విషయం బయటకు పొక్కకుండా గుట్టుగా పెళ్లిచేసిన అక్క!

  • కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఘటన
  • మైనర్ బాలికపై నిందితుడి అత్యాచారం
  • పోలీసులకు ఫిర్యాదు వెళ్లకుండా రెండో పెళ్లి

కర్ణాటకలో ఓ కామాంధుడు రెచ్చిపోయాడు. తన ఇంట్లో ఆశ్రయం పొందుతున్న వరుసకు మరదలు అయ్యే మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. అయితే చెల్లికి అండగా నిలవాల్సిన అక్క భర్తకే మద్దతు పలికింది. ఈ విషయం బయటపడితే పోలీసులు అరెస్ట్ చేస్తారన్న భయంతో చెల్లిని భర్తకు ఇచ్చి వివాహం చేసింది. చివరికి విషయం తెలుసుకున్న పోలీసులు భార్యాభర్తలను అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.

కర్ణాటకలోని కోలార్‌ జిల్లా మలూర్‌ తాలూకా హునసికోట్‌లో గంగరాజు(32) పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవితం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో భర్తను వదిలేసిన పల్లవి పరిచయం కావడంతో ఆమెను గంగరాజు పెళ్లి చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో పల్లవికి చెల్లెలి వరుసయ్యే ఓ మైనర్ బాలిక(13) వీరితో కలసి ఉంటోంది. ఈ అమ్మాయిపై కన్నేసిన గంగరాజు ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు.

ఈ విషయం తెలుసుకున్న పల్లవి సోదరికి అండగా నిలవాల్సింది పోయి భర్తకు వత్తాసు పలికింది. సదరు యువతిని గంగరాజుకు ఇచ్చి రహస్యంగా పెళ్లి చేసింది. అయితే ఈ విషయం ఎలాగోలా బయటకు పొక్కడంతో కౌన్సెలర్‌, లీగల్‌ అడ్వైజర్‌తో కలిసివచ్చిన పోలీసులు బాధితురాలి నుంచి వాంగ్మూలం స్వీకరించారు.

ఈ నేపథ్యంలో బాలిక తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు గంగరాజు, పల్లవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం రిమాండ్ కు తరలించారు.

More Telugu News