Prakasam District: ఫలించిన విజయసాయిరెడ్డి మంత్రాంగం... నేడు వైసీపీలోకి తెలుగుదేశం కీలక నేత!

  • నేడు జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి
  • ప్రకాశం జిల్లాలో మాగుంట ఫ్యామిలీకి మంచి పేరు
  • ఆయన్ను ఆహ్వానించాలని స్వయంగా ఆదేశించిన జగన్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంత్రాంగం ఫలించింది. ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో సీనియర్ గా, ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి, నేడు వైఎస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నారు. ఆయన చేరిక వెనుక గత కొన్ని నెలలుగా విజయసాయి నడిపిన రాయబారం ఓ కారణమైతే, మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లాలో ఉన్న మంచి పేరుతో, ఆయన పార్లమెంట్ కు పోటీ చేస్తే, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులకు ప్లస్ పాయింట్ అవుతుందని పలువురు చెప్పడం కూడా కారణమని వైసీపీ నేతలు అంటున్నారు.

మాగుంట శ్రీనివాసుల రెడ్డి సోదరుడు దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి ప్రకాశం జిల్లాలో ఎంతో పేరున్న కాంగ్రెస్ నేత. పలుమార్లు ఎంపీగా గెలిచిన ఆయన, జిల్లా వ్యాప్తంగా ఎంఎస్ఆర్ జూనియర్ కళాశాలలు స్థాపించారు. ఆయన్ను నక్సల్స్ దారుణంగా హత్య చేసిన తరువాత, ఆయన సతీమణి సైతం రాజకీయాల్లో రాణించారు. కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలిచి, ఆపై కుటుంబ రాజకీయ వారసత్వాన్ని శ్రీనివాసులరెడ్డి అందుకుని, ఇప్పటివరకూ మూడుసార్లు ఎన్నికల్లో విజయం సాధించారు. మాగుంటను ఎలాగైనా పార్టీలోకి ఆహ్వానించాలని విజయసాయిని జగన్ స్వయంగా ఆదేశించడంతో రంగంలోకి దిగిన ఆయన సక్సెస్ అయ్యారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

More Telugu News