TRS: సబితా ఇంద్రారెడ్డికి స్వయంగా ఫోన్ చేసిన రాహుల్ గాంధీ!

  • సబిత టీఆర్ఎస్ లో చేరనున్నారని వార్తలు
  • బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన రాహుల్
  • వెంటనే ఢిల్లీకి రావాలని ఆహ్వానం
  • బయలుదేరిన సబిత, కార్తీక్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హోమ్ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి, టీఆర్ఎస్ లో చేరనున్నారని వచ్చిన వార్తలు తీవ్ర కలకలం రేపగా, ఆమెను బుజ్జగించేందుకు స్వయంగా రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. నిన్న రాత్రి సబితకు ఫోన్ చేసిన రాహుల్, పార్టీ మారాలన్న ఆలోచన వద్దని, వెంటనే తనను కలవాలని సూచించారు. దీంతో తన కుమారుడు కార్తీక్ రెడ్డితో కలిసి సబిత నేడు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

అంతకుముందు ఆమెతో రేవంత్ రెడ్డి భేటీ అయి, పార్టీ మారితే జరిగే పరిణామాలను వివరించి, నచ్చజెప్పగా ఆమె మెత్తబడ్డట్టు తెలుస్తోంది. సబిత, కార్తీక్ లతో పాటు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇదిలావుండగా, లోక్ సభకు పోటీ పడే అభ్యర్థుల జాబితాను ఖరారు చేసేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు కూడా నేడు ఢిల్లీకి వెళ్లి, కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చలు జరపనున్నారు. 

More Telugu News