Chandrababu: మాజీ మంత్రి ఏరాసు టీడీపీని వీడబోతున్నారంటూ ప్రచారం.. నేడు చంద్రబాబుతో భేటీ

  • గౌరు చరితకు పాణ్యం సీటు కేటాయింపుపై అలక
  • అనుచరులతో రహస్య సమావేశం
  • కబురుపెట్టిన చంద్రబాబు

మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో భేటీ కానున్నారు. ఇటీవల పార్టీలో చేరిన గౌరు చరితకు పాణ్యం సీటు కేటాయించడంపై ఏరాసు అలకబూనినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని రెండు రోజులుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో ఏరాసు భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. నేటి రాత్రి అమరావతిలో చంద్రబాబు నివాసంలో సీఎంతో ఏరాసు సమావేశం కానున్నారు.

కాగా, పాణ్యం సీటును గౌరు చరితకు కేటాయించిన తర్వాత అసంతృప్తిగా ఉన్న ఏరాసు ఇటీవల చంద్రబాబుతో జరిగిన జిల్లా నేతల సమావేశానికి కూడా హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మారబోతున్నారన్న వార్తలు హల్‌చల్ చేశాయి. అంతేకాదు, అనుచరులతో రహస్యంగా సమావేశం అయినట్టు కూడా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబే స్వయంగా ఏరాసుకు కబురుపెట్టినట్టు సమాచారం.

More Telugu News