India: నాలుగో వన్డేలో భారత్ కు షాకింగ్ ఓటమి... టర్నర్ మెరుపుదాడి

  • 4 వికెట్ల తేడాతో ఆసీస్ అద్భుత విజయం
  • 359 టార్గెట్ ను ఉఫ్ మని ఊదేసిన కంగారూలు
  • హ్యాండ్స్ కోంబ్ శతకం

ఒకప్పటితో పోలిస్తే క్రికెట్ ఆడే తీరులో ఎంతో మార్పు కనిపిస్తోంది. 300 పైచిలుకు స్కోర్లు కూడా ఎంతమాత్రం సురక్షితం కావు అని ఈమధ్య వస్తున్న మ్యాచ్ ఫలితాలు నిరూపిస్తున్నాయి. తాజాగా, టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొహాలీలో జరిగిన నాలుగో వన్డేలో ఇలాంటి ఫలితమే వచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.

చాన్నాళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చిన ఓపెనర్ శిఖర్ ధావన్ 115 బంతుల్లో 143 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (95) ఐదు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. లక్ష్యం చూస్తే 359 పరుగులు.. 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆసీస్!... ఈ దశలో ఆ జట్టు గెలుస్తుందని ఎవరూ ఊహించలేదు. అయితే, ఉస్మాన్ ఖవాజా, పీటర్ హ్యాండ్స్ కోంబ్ అద్భుత పోరాటంతో మ్యాచ్ ను దిశ మళ్లించారు.

ఖవాజా 91 పరుగులు చేయగా, హ్యాండ్స్ కోంబ్ 117 పరుగులు సాధించాడు. అయితే ఈ జోడీ అవుటవడంతో మ్యాచ్ పై భారత్ కు ఆశలు కలిగినా, ఆస్టన్ టర్నర్ ఆ ఆశలపై ఓ సుడిగాలి ఇన్నింగ్స్ తో నీళ్లు చల్లాడు. టర్నర్ 43 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్ ల సాయంతో మెరుపువేగంతో 84 పరుగులు సాధించి తన జట్టుకు అద్భుత విజయాన్నందించాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు టర్నర్ నే వరించింది. ఈ మ్యాచ్ విజయంతో ఐదు వన్డేల సిరీస్ ను 2-2తో సమం చేసింది ఆసీస్. ఇక, ఇరు జట్ల మధ్య చివరి వన్డే ఢిల్లీలో మార్చి 13న జరగనుంది.

More Telugu News