Telangana: చాక్లెట్ ఆశ చూపి బాలికపై యువకుడి అత్యాచారం!

  • హైదరాబాద్ లోని సైదాబాద్ లో ఘటన
  • తొమ్మిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
  • కేసును దారిమళ్లించేందుకు ప్రయత్నాలు షురూ

కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న ఓ చిన్నారి(9)పై లైంగికదాడికి పాల్పడ్డాడు. అనంతరం ఘటనాస్థలి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపును ప్రారంభించారు. తెలంగాణలోని హైదరాబాద్ లో శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, నిందితుడు ఓ రాజకీయ నేత కుమారుడు కావడంతో కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది.

హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతం గ్రీన్ పార్క్ కాలనీలో రమావత్‌ శ్రీను నాయక్‌(24) తన కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన కానిస్టేబుల్ పరీక్షల్లో ఉత్తీర్ణుడైన శ్రీను.. దేహదారుఢ్య పరీక్షలకు హాజరుకావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం శ్రీను కుటుంబ సభ్యులు ఓ వివాహ వేడుకకు బయలుదేరారు. దీంతో షాపును చూసుకునేందుకు శ్రీను అక్కడే ఉండిపోయాడు. కాగా, అక్కడే షాపు ముందు సోదరుడితో కలిసి ఆడుకుంటున్న బాలిక(9)కు చాక్లెట్ ఆశ చూపాడు.

అనంతరం చాక్లెట్ ఇస్తానని చెప్పి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లాడు. వెంట వస్తున్న బాలిక సోదరుడిని వెనక్కి పంపాడు. ఈ నేపథ్యంలోఇంటికి వస్తున్న బాలుడిని చెల్లి ఎక్కడ? అని తల్లి అడిగింది. శ్రీను ఇంటిలోకి తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె హుటాహుటిన అక్కడకు బయలుదేరింది. అప్పటికే బాలికపై అత్యాచారానికి పాల్పడిన శ్రీను ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు.

కుమార్తెకు రక్తస్రావం కావడాన్ని గమనించిన తల్లి.. ఆమెను తొలుత ప్రైవేటు ఆసుపత్రికీ, అనంతరం మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లింది. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, శ్రీను నాయక్ తండ్రి ఓ జాతీయ పార్టీ నాయకుడు కావడంతో ఈ కేసును దారి మళ్లించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

More Telugu News