Hyderabad: మోదీ ఓ టెర్రిరిస్టులా వ్యవహరిస్తున్నారు: కాంగ్రెస్ నేత విజయశాంతి

  • ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ పోరాడుతున్నారు
  • ఖూనీ చేయాలని మోదీ చూస్తున్నారు
  • యావత్తు దేశం మోదీ పట్ల ఆగ్రహంగా ఉంది

ప్రజాస్వామ్యం బతకాలని రాహుల్ పోరాడుతుంటే, దాన్ని ఖూనీ చేయాలని మోదీ చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేత విజయశాంతి అన్నారు. శంషాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, రాహుల్ గాంధీకి, మోదీకి యుద్ధం మొదలైందని, యావత్తు దేశం మోదీ పట్ల ఆగ్రహంగా ఉందని విమర్శించారు. మోదీ ఓ టెర్రిరిస్టులా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, టీఆర్ఎస్ పార్టీ పైన ఆమె విమర్శలు చేశారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఆ పని మాత్రం చేయొద్దని ప్రజలకు పిలుపు నిచ్చారు. యావత్తు దేశం మోదీకి వ్యతిరేకంగా ఉంటే, కేసీఆర్ మాత్రం ఆయనకు అనుకూలంగా ఉన్నారని, తెలంగాణలో కేసీఆర్ నియంతపాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రలోభాలకు గురి చేసి తమ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ కొనుగోలు చేస్తోందని ఆరోపించారు. కాగా, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ నేత కుంతియా, టీకాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కొండా విశ్వేశ్వరరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

More Telugu News