Boddu Bhaskara Ramarao: తెలుగుదేశం పార్టీకి సీనియర్ నేత బొడ్డు భాస్కర రామారావు గుడ్ బై?

  • సీనియర్ నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు
  • చినరాజప్ప స్థానం కావాలంటూ పంచాయితీ
  • కుదరదనేసరికి పార్టీ మారే ఆలోచన

తూర్పుగోదావరి జిల్లాలో పట్టున్న సీనియర్ నేతగా పేరున్న పెద్దాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు టీడీపీకి గుడ్ బై చెప్పనున్నట్టు తెలుస్తోంది. పెద్దాపురం టికెట్ ను ఆశించిన ఆయనకు అధిష్ఠానం నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న సాయంత్రం పెద్దాపురంలో తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఆయన, తన మనసులోని మాటను చెప్పినట్టు తెలుస్తోంది.

కాగా, ఇటీవల తనకు టికెట్ విషయంలో పార్టీ నేతలను కలిసిన ఆయన, 6వ తేదీ వరకూ నిర్ణయం కోసం ఎదురు చూస్తానని, ఆపై తన దారి తాను చూసుకుంటానని ప్రకటించారు. వాస్తవానికి పెద్దాపురం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హోమ్ శాఖను చూస్తున్న చినరాజప్ప ఉండగా, మరోసారి ఆయనకే టికెట్ ఖరారైంది. దీంతో చంద్రబాబు వద్దకు వెళ్లిన బొడ్డు, చినరాజప్పకు రాజమహేంద్రవరం గ్రామీణ నియోజకవర్గం టికెట్ ను ఇవ్వాలని, తనకు పెద్దాపురం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో చంద్రబాబు స్పందనపై మనస్తాపంతో ఉన్న ఆయన పార్టీని వీడనున్నట్టు సమాచారం. ఇక బొడ్డు ఏ పార్టీలో చేరతారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.

More Telugu News