Nagababu: 'మా' వార్ ను వన్ సైడ్ చేసేసిన మెగా ఫ్యామిలీ!

  • మరికొన్ని గంటల్లో 'మా' ఎన్నికలు
  • నరేష్, జీవిత ప్యానల్ కు నా మద్దతు
  • మీడియాతో మెగా బ్రదర్ నాగబాబు

మరికొన్ని గంటల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు జరగనున్న వేళ, తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నికల వాతావరణం మరింతగా వేడెక్కింది. 'మా' సింహాసనం కోసం నటులు శివాజీరాజా, నరేష్ మధ్య పోటీ జరుగుతుండగా, ఈ వార్ ను వన్ సైడ్ చేసేలా మాట్లాడారు మెగా బ్రదర్ నాగబాబు. తన మద్దతు నరేష్ కేనని స్పష్టం చేశారు. దీంతో నిన్నటివరకూ చిరంజీవి మద్దతు తమకుందని రెండు ప్యానల్స్ చెప్పుకుంటూ ప్రచారం చేయగా, నేటితో ఆ అనుమానాలు తీరిపోయినట్లయింది.

తాజాగా నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, తాను నరేష్, జీవిత, రాజశేఖర్ ప్యానల్ కు మద్దతిస్తున్నట్టు చెప్పారు. అధ్యక్షుడిగా ఒకరే ఉండకూడదన్నది తన ఉద్దేశమని, తాను ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలోనూ రెండోసారి కొనసాగాలని కోరితే, అంగీకరించలేదని, అసలు ఏ అభ్యర్థికి కూడా రెండు మూడు సార్లు కొనసాగాలన్న కోరిక ఉండరాదని అన్నారు. నరేష్, రాజశేఖర్, జీవితలకు ఎంతో అనుభవం ఉందని, మహిళగా జీవిత పోటీలో ఉండటం కూడా తనకు నచ్చిందని అన్నారు. రాజశేఖర్ కూడా ప్యానల్ లో ఉండటంతో 'మా' అసోసియేషన్ కు ఫ్రెష్ ఫీలింగ్ వచ్చిందని అన్నారు.

More Telugu News