Rajamouli: బాహుబలి-3లో నటించేందుకు ఆరాటపడుతున్న హాలీవుడ్ దిగ్గజం

  • ఏదైనా మంచిపాత్ర లభిస్తే భారత్ వస్తాను
  • శామ్యూల్ ఎల్ జాక్సన్ ఆసక్తి
  • అవెంజర్స్' ప్రచారంలో బాహుబలి ప్రస్తావన

భారత సినీ చరిత్రలో తిరుగులేని విజయాన్ని అందుకున్న బాహుబలి చిత్రాలు అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళికే కాదు తెలుగు సినిమా పరిశ్రమకు కూడా ప్రపంచస్థాయిలో ప్రత్యేక స్థానం లభించింది.

ఇక అసలు విషయానికొస్తే... హాలీవుడ్ లో నట దిగ్గజంగా పేరొందిన శామ్యూల్ ఎల్ జాక్సన్ అంతటివాడు సైతం బాహుబలి-3లో అవకాశం ఇస్తే తప్పకుండా నటిస్తానని మనసులో మాట బయటపెట్టాడు. తాను నటించిన కొత్త చిత్రం అవెంజర్స్: కెప్టెన్ మార్వెల్ ప్రమోషన్స్ లో భాగంగా 'మోస్ట్ లీ సేన్' అనే ఓ యూట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శామ్యూల్ ఎల్ జాక్సన్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

మీకేమైనా భారత్ వెళ్లే ఆలోచన ఉందా? అని ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి ప్రశ్నించగా, అక్కడెవరైనా మంచి పాత్ర ఇస్తే ఎందుకు వెళ్లను? అంటూ సమాధానం చెప్పాడు జాక్సన్. అంతేకాదు, మీరు బాలీవుడ్ గురించి ఎప్పుడైనా విన్నారా? బాలీవుడ్ సినిమాలో నటించాలనుకుంటున్నారా? అని అడగ్గా... బాహుబలి-3లో నటించాలని కోరుకుంటున్నాను అంటూ జవాబిచ్చాడు.

శామ్యూల్ ఎల్ జాక్సన్ ను హాలీవుడ్ లో ఉన్న అత్యంత ప్రతిభావంతులైన క్యారక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరిగా పేర్కొంటారు. ది ఎక్సార్సిస్ట్, జురాసిక్ పార్క్, ఏ టైమ్ టు కిల్, డై హార్డ్ విత్ ఏ వెంజన్స్, ద ఇంక్రెడిబుల్స్, స్టార్ వార్స్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. 1994లో వచ్చిన పల్ప్ ఫిక్షన్ అనే చిత్రంలో కనబర్చిన నటనకు గాను ఆస్కార్ అవార్డుకు కూడా నామినేట్ అయ్యారు శామ్యూల్ ఎల్ జాక్సన్.

More Telugu News