55 years old: నాకు వారసుడు కావాలి.. 55 ఏళ్ల వయసులో మరో పెళ్లి చేసుకున్న తండ్రి.. పోలీసులను ఆశ్రయించిన కుమార్తెలు!

  • కర్ణాటకలోని బెళగావిలో ఘటన
  • పాటిల్ కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు
  • కుమారుడు చనిపోవడంతో వారసుడి కోసం పెళ్లి

ఇద్దరు పెళ్లీడుకొచ్చిన పిల్లలు ఉన్నప్పటికీ ఓ తండ్రి అడ్డదారులు తొక్కాడు. తనకు వారసుడు కావాలంటూ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. కుటుంబాన్ని వదిలేసి యువతితో మరో కాపురం పెట్టాడు. ఈ విషయమై కుమార్తెలు ఆందోళనకు దిగడంతో గ్రామస్తులు వీరికి మద్దతు పలికారు. అనంతరం స్థానికుల సాయంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటకలోని బెళగావిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

బెళగావి తాలూకాలోని కాకతి గ్రామానికి చెందిన బాళెగౌడ పాటిల్‌ (55)కు పాతికేళ్ల క్రితం మహదేవి అనే మహిళతో వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. అయితే కొన్నేళ్ల క్రితం అనారోగ్యంతో కుమారుడు చనిపోయాడు. ఇటీవల పెద్ద కుమార్తెకు పెళ్లి చేసి పంపారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ.. తనకు వారసుడు కావాలని పట్టుబట్టాడు.

అక్కడితో ఆగకుండా ఓ యువతిని పెళ్లి చేసుకుని బెళగావిలో కాపురం పెట్టాడు. కుటుంబం ఆర్థిక కష్టాల్లో చిక్కుకోవడంతో ఇద్దరు కుమార్తెలు తండ్రిని వెతుక్కుంటూ వచ్చారు. అయితే ఇంటిలో ఎవ్వరూ లేకపోవడంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. తమ తండ్రి వ్యవహారశైలిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

More Telugu News