Ravali: అంత్యక్రియలకు ముందు రవళి మృతదేహానికి వివాహం జరిపించిన తల్లిదండ్రులు!

  • గతవారం ప్రేమోన్మాది దాడికి గురైన రవళి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి
  • తమ చివరి కోరికను తీర్చుకున్న తల్లిదండ్రులు
  • కన్నీళ్ల మధ్యే అరటి చెట్టుతో వివాహం

ప్రేమించడం లేదన్న కారణంగా ఓ ఉన్మాది దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తే, ఒళ్లంతా కాలిన గాయాలతో దాదాపు వారం రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిన రవళి అంత్యక్రియలు బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ముగిశాయి. తమ బిడ్డ డిగ్రీ చదువుతోందని, అది పూర్తికాగానే, ఓ మంచి వరుడిని చూసి వివాహం జరిపించాలన్న గంపెడాశతో, సంబంధాలు చూడటం కూడా మొదలు పెట్టిన రవళి తల్లిదండ్రులు పద్మ, సుధాకర్ లు తమ చివరి కోరికగా, అంత్యక్రియలకు ముందు రవళి మృతదేహానికి ఓ అరటి చెట్టుతో శాస్త్రోక్తంగా వివాహం జరిపించారు.

గత వారంలో హన్మకొండలోని ఓ కళాశాలలో రవళిపై అన్వేష్ అనే యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన సంగతి తెలిసిందే. 85 శాతం గాయాలతో, కాలిపోయిన కళ్లు, ఊపిరితిత్తులతో, శరీరంలోని ఏ అవయవమూ పనికిరానంతగా మాడిపోయి, ఆరు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన రవళి, సోమవారం నాడు మరణించిన సంగతి తెలిసిందే. ఆసుపత్రి నుంచి తెల్లటి బట్టలో ఇంటికి చేరిన రవళి మృతదేహాన్ని చూసి విలపించని వారు లేరు. ఆమె మృతదేహంపై అంక్షితలు వేస్తూ, ఇలా జరిగిందేమిటమ్మా? అని బోరున విలపించారు. మరే బిడ్డకూ ఇటువంటి పరిస్థితి రాకూడదని మొక్కుకున్నారు.

More Telugu News