NDA: ఎన్డీయే హయాంలో ఏ ఒక్క విమానమైనా కొన్నారా?: కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి

  • ‘రాఫెల్’ అంశంలో మోదీవి పొంతన లేని సమాధానాలు
  • ఈ ఒప్పందానికి బ్యాంక్ గ్యారెంటీ లేదు
  • రాఫెల్ కుంభకోణంలో మోదీ నేరస్తుడు

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు అంశంలో ప్రధాని మోదీ పొంతన లేకుండా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు.  హైదరాబాద్ లోని గాంధీభవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాఫెల్ ఒప్పందానికి బ్యాంక్ గ్యారెంటీ లేదని ‘కాగ్’ స్పష్టం చేసిందని అన్నారు.

రాఫెల్ యుద్ధ విమానాలను ఎంత డబ్బు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారని ప్రశ్నిస్తే ‘దేశ రక్షణ..’ అంటూ సమాధానం దాట వేస్తున్నారని బీజేపీ నేతలపై ఆయన విరుచుకుపడ్డారు. బాలాకోట్ పై దాడికి ‘రాఫెల్’కు లింకు పెట్టడమేంటని ప్రశ్నించిన జైపాల్ రెడ్డి, రాఫెల్ కుంభకోణంలో మోదీ నేరస్తుడని తేలిపోయిందని ఆరోపించారు. దేశ రక్షణకు ముప్పు తెచ్చేలా వ్యవహరిస్తున్నారంటూ మీడియా ప్రతినిధులను బీజేపీ ప్రశ్నించడాన్ని తాము ఖండిస్తున్నట్టు చెప్పారు.  

More Telugu News