Andhra Pradesh: ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5, ఏబీఎన్ పై జగన్ బురద చల్లుతున్నారు!: మంత్రి దేవినేని ఉమ

  • ఈ మీడియాపై జగన్ దాడి చేస్తున్నారు
  • సాక్షిని జగన్ కుటుంబమే నడుపుతోంది
  • ఏపీ ప్రతిపక్ష నేతపై మండిపడ్డ మంత్రి దేవినేని

వైసీపీ అధినేత జగన్ కొన్ని మీడియా సంస్థలపై ఉద్దేశపూర్వకంగా బురద చల్లుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. ఈరోజు ఈనాడు పత్రిక, ఆంధ్రజ్యోతి పత్రిక, ఈటీవీ, ఏబీఎన్, టీవీ5 ఛానల్స్ లక్ష్యంగా జగన్ విమర్శలు గుప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మీడియా సంస్థలపై ‘ఎల్లో మీడియా’ అని ముద్ర వేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్ల తొలగింపుపై  టీడీపీ నేతలతో కలిసి ఈరోజు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న మీడియాపై దాడిచేసే అధికారం జగన్ కు ఎంతమాత్రం లేదని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. అవినీతి డబ్బుతో సాక్షి పత్రికను, ఛానల్ ను జగన్ కుటుంబమే నడుపుతోందని ఆరోపించారు. దేశంలో, ఏపీలో ఏ రాజకీయ పార్టీ కూడా ఈ పనిచేయడం లేదన్నారు. టీడీపీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలు ఓటును నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సేవామిత్ర డేటాను తెలంగాణ పోలీసులు తీసుకోవడంపై గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశామన్నారు.

More Telugu News