Reliance: భారత్ లో 1జీబీ డేటా సగటు ధర రూ.18.5.. అమెరికాలో ఎంతో చూడండి!

  • భారత్ లోనే డేటా చాలా చవక
  • యూకే వెబ్ సైట్ వెల్లడి
  • 6,313 డేటాప్లాన్లు పరిశీలన

భారత్ లో ఇంటర్ నెట్ డేటా విప్లవం గురించి చెప్పాల్సివస్తే జియోకి ముందు, జియో తర్వాత అని చెప్పాలి. రిలయన్స్ మానస పుత్రిక జియో రంగప్రవేశంతో అప్పటివరకు ఉన్న ఇంటర్నెట్ హద్దులన్నీ చెరిగిపోయాయి. ఎంతో ఖరీదైనదిగా భావించే నెట్ డేటా అత్యంత చవకగా అందుబాటులోకి వచ్చింది. జియో రాకతోనే భారత్ లో ఇంటర్నెట్ వినియోగం పెరిగిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. దాని ఫలితమే ప్రపంచంలోకెల్లా అత్యంత చవకగా డేటా లభించే దేశాల్లో భారత్ కు అగ్రస్థానం దక్కింది. భారత్ లో సగటున 1జీబీ డేటా రూ.18.5 కాగా, అంతర్జాతీయ విపణిలే అదే 1జీబీ డేటా సగటు ధర రూ.600 పలుకుతోంది.

ఎంతో అభివృద్ధి చెందిన అగ్రరాజ్యం అమెరికాలో సైతం ఈ ధర రూ.868.31 అంటే భారత్ లో డేటా ఎంత చవకగా లభిస్తుందో అర్థమవుతుంది. యూకేలో కూడా 1జీబీ డేటా ఇంచుమించు రూ.467.22 ధర పలుకుతోంది. బ్రిటన్ కు చెందిన ప్రఖ్యాత ప్రైస్ కంపారిజన్ సైట్ Cable.co.uk ఈ వివరాలు వెల్లడించింది. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో అమల్లో ఉన్న 6,313 డేటా ప్లాన్లను పరిశీలించారు. సదరు వెబ్ సైట్ నిర్వహించిన అధ్యయనం ద్వారా డేటా సంబంధిత వివరాలే కాదు, స్మార్ట్ ఫోన్ మార్కెట్ వృద్ది తదితర అంశాలు కూడా వెల్లడయ్యాయి. చైనా తర్వాత భారతదేశంలోనే అత్యధికంగా 43 కోట్ల మంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులున్నారట.

More Telugu News