Andhra Pradesh: డేటా చోరీ కేసులో ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్ : వైసీపీ నేత కన్నబాబు ఆరోపణలు

  • నీతులు చెప్పే చంద్రబాబు చేస్తున్నవన్నీ దొంగ పనులే
  • సైబర్ క్రైమ్ కు చంద్రబాబు తెరలేపారు
  • ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది

డేటా చోరీ కేసులో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లే నిందితులంటూ వైసీపీ నేత కన్నబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ కేసులో నిందితులు ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్ అంటూ ఆరోపించారు. నీతులు చెప్పే చంద్రబాబు చేస్తున్నవన్నీ దొంగ పనులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సైబర్ క్రైమ్ కు తెరలేపిన చంద్రబాబును కట్టడి చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

అన్నింటినీ తాను కనిపెట్టినట్టుగా చెప్పుకునే చంద్రబాబునాయుడు వాటిని కనిపెట్టారో లేదో తెలియదు కానీ, డేటా చౌర్యం విషయంలో మాత్రం ఆద్యుడిగా నిలిచాడని విమర్శించారు. గోప్యంగా ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని, లబ్ధిదారుల వివరాలను, ఎన్నికల సంఘం ప్రకటించిన ఓటర్ల వివరాలను కూడా చౌర్యం చేశారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఓటమి పాలవుతానన్న భయం చంద్రబాబును వెంటాడుతోందని, టీడీపీకి పుట్టగతులుండవని ఆయన భయపడిపోతున్నారని అన్నారు. 

More Telugu News