Nizamabad District: దేశాన్ని రక్షించే సత్తా ఉన్న నాయకుడు మోదీనే: అమిత్ షా

  • క్లస్టర్ స్థాయి, శక్తి కేంద్రాలకు అమిత్ షా దిశానిర్దేశం
  • ఐదేళ్లలో దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచాం
  • రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం మాదే

దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై క్లస్టర్ స్థాయి, శక్తి కేంద్రాలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, జహీరాబాద్ ఎంపీ స్థానాల క్లస్టర్ స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ, ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి పనులను ఐదేళ్లలో మోదీ ప్రభుత్వం చేసిందని, దేశంలో రైతుల కోసం పని చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ అని అన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే బీజేపీ లక్ష్యమని, ఏడాదికి రూ.6 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నామని అన్నారు.

ఐదేళ్లలో దేశ ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచామని, దేశాన్ని రక్షించే సత్తా ఉన్న నాయకుడు మోదీ అని ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధిస్తుందని, మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం కోసం ప్రతిఒక్కరూ శ్రమించాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం కోసమే కాదు, భారత దేశం కోసమూ గెలవాలని అమిత్ షా భావోద్వేగ ప్రసంగం చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అసోం నుంచి గుజరాత్ వరకు గెలుపే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని అన్నారు. ఈ సందర్భంగా పాక్ పై భారత వైమానిక దాడుల గురించి అమిత్ షా ప్రసంగించారు. దాడులకు ప్రతిదాడులతో సమాధానం ఇచ్చామని, పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని చెప్పారు.

దేశంలో ప్రతిపక్ష పార్టీల నేతలు లేరని, రాహుల్ బాబా నేతృత్వంలో కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తోందని, ఎన్నికలకు వెళ్లేందుకు ఆ పార్టీకి ఒక అజెండా లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి చేసిందేమీ లేదని, దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టారని విమర్శించారు.

కాగా, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్న అమిత్ షాకు టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు ఘనస్వాగతం పలికారు.

More Telugu News