Ashok: ఇక ఏ క్షణమైనా అశోక్ అరెస్ట్... జల్లెడ పడుతున్న పోలీసులు!

  • విదేశాలకు పారిపోకుండా చర్యలు
  • అన్ని ఎయిర్ పోర్టులకూ లుకౌట్ నోటీసులు
  • రేపటిలోగా అరెస్ట్ చేస్తామంటున్న పోలీసులు

'ఐటీ గ్రిడ్' సీఈఓ అశోక్ ను ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తామని తెలంగాణ పోలీసులు ప్రకటించారు. ఆయన కోసం పలు ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు. అశోక్ విదేశాలకు పారిపోకుండా అన్ని ఎయిర్ పోర్టులకూ లుకౌట్ నోటీసులు జారీ చేశామని తెలిపారు. అశోక్ లొంగిపోయేందుకు ఇచ్చిన గడువు మంగళవారంతో ముగిసిందని, హైదరాబాద్ లో నమోదైన కేసులను లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామని, ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేసిన లోకేశ్వర్‌ రెడ్డిని విచారించామని సైబరాబాద్ పోలీసు వర్గాలు వెల్లడించాయి.

కాగా, రేపటిలోగా అశోక్ ను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని, ఆయన్ను అరెస్ట్ చేస్తే, డేటా చోరీపై కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. ఈ కేసులో కంప్యూటర్, ల్యాప్ టాప్ ల ఎఫ్‌ఎస్‌ఎల్‌ నివేదిక రేపు పోలీసుల చేతికి అందుతుందని తెలుస్తోంది.  ఆంధ్రా, తెలంగాణ మధ్య ఐటీ గ్రిడ్ కంపెనీ వ్యవహారం పెనుదుమారం రేపుతుండగా, తెలంగాణను విడిచి ఏపీకి వెళ్లిన అశోక్, అక్కడే ఆశ్రయం పొందుతున్నట్టు తెలంగాణ పోలీసులు భావిస్తున్నారు. అతని కోసం ప్రత్యేక బృందాలు ఏపీలో సోదాలు జరుపుతున్నాయి. 

More Telugu News