Lover: సెల్ టవర్ ఎక్కిన ప్రియురాలిని కిందకు దించి, ప్రియుడితో కలిపిన వరంగల్ పోలీసులు!

  • ఉద్యోగం వచ్చిన తరువాత ప్రియురాలిని దూరం పెట్టిన ప్రియుడు
  • సెల్ టవర్ ఎక్కి వివాహం జరిపించాలని మాలిక డిమాండ్
  • కౌన్సెలింగ్ ఇచ్చి, వివాహం జరిపించిన పోలీసులు

తాను ప్రేమించిన యువకుడు మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడని తెలుసుకున్న ఓ యువతి, సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేయగా, పోలీసులు కలుగజేసుకుని, వారిద్దరికీ వివాహం జరిపించారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, మాలిక అనే యువతి హన్మకొండలోని ఓ నర్సింగ్‌ హోమ్‌ లో నర్సుగా పనిచేస్తుండగా, ఆమె సొంత గ్రామమైన హసన్ పర్తికి చెందిన మోషే అనే యువకుడితో ప్రేమలో పడింది. గత సంవత్సరం మోషేకు సింగరేణిలో ఉద్యోగం రాగా, అప్పటి నుంచి ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. తనను వివాహం చేసుకోవాలని ఆమె ఒత్తిడి పెంచినా పట్టించుకోలేదు.

 ఈ క్రమంలో మోషేకు ఇటీవల మరో యువతితో నిశ్చితార్థం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె, మంగళవారం తెల్లవారుజామున సెల్‌ టవర్‌ ఎక్కి ప్రియుడితో కలపాలని డిమాండ్‌ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు, ఆమెతో మాట్లాడి, మోషేను స్టేషన్ కు పిలిపించారు. ఆపై అతనికి కౌన్సెలింగ్ ఇవ్వగా, పెళ్లికి అంగీకరించాడు. దీంతో మాలిక సెల్ టవర్ దిగింది. పెళ్లికి తన తల్లిదండ్రులతో వస్తానని చెప్పి వెళ్లిన మోషే, ఎంతకూ తిరిగి రాకపోవడంతో, మాలిక కుటుంబీకులు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. చివరకు రాత్రి 9 గంటల సమయంలో మోషేను మరోసారి తీసుకువచ్చి వారిద్దరికీ వివాహం జరిపించారు పోలీసులు.

More Telugu News