Andhra Pradesh: హైదరాబాద్ లోని ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇంట్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేసిన జీహెచ్ఎంసీ

  • డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇంట్లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • పార్కు స్థలాన్ని ఆక్రమించారంటూ వైసీపీ నేత ఆళ్ల పిల్
  • 11వ తేదీ లోగా కౌంటర్ దాఖలు చేయాలన్న కోర్టు

ఏపీ-తెలంగాణ పోలీసుల మధ్య డేటా వార్ జరుగుతున్న ప్రస్తుత సమయంలో అక్రమ నిర్మాణాలంటూ హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్ ఇంట్లోని నిర్మాణాలను జీహెచ్ఎంసీ కూల్చివేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్‌నగర్‌లో ప్లాటు నెంబర్ 149లో డీజీపీ ఇల్లు ఉంది. అయితే, దీనికి ఆనుకుని ఉన్న హౌసింగ్ సొసైటీకి చెందిన  స్థలాన్ని డీజీపీ ఆక్రమించి ప్రహరీ నిర్మించారనేది జీహెచ్ఎంసీ అధికారుల ఆరోపణ. ఈ నేపథ్యంలో మంగళవారం అధికారులు దీనిని కూల్చివేశారు.
 
 తన ఇంటికి జీ ప్లస్ 1కు మాత్రమే అనుమతి ఉండగా డీజీపీ మూడు అంతస్తులు నిర్మించారనేది మరో అరోపణ. అయితే, ఆ తర్వాత డీజీపీ వాటిని క్రమబద్ధీకరించుకున్నారు. ఠాకూర్ తన ఇంటి కోసం మెట్లు నిర్మించే సమయంలో పక్కనే ఉన్న జీహెచ్ఎంసీ పార్కులోని కొంత స్థలాన్ని ఆక్రమించారని అధికారులు గుర్తించారు. ఈ విషయమై జీహెచ్ఎంసీకి హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు చేసింది.  

కాగా,  జీహెచ్‌ఎంసీ పార్కు స్థలం ఆక్రమణ, అక్రమ నిర్మాణాల కేసులో కౌంటర్ దాఖలు చేయాలంటూ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను హైకోర్టు మంగళవారం ఆదేశించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కౌంటర్ దాఖలకు రెండు వారాల గడువు కావాలన్న డీజీపీ తరపు న్యాయవాది అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు ఈనెల 11కే దాఖలు చేయాలని తేల్చి చెప్పింది.  

More Telugu News