Telangana: నేను ఢిల్లీ రాజకీయాలకు దూరం.. ఆ వార్తల్లో నిజం లేదు: కోడెల

  • టీడీపీ నాకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది
  • ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే పోటీ
  • జగన్‌ను సీఎం చేసేందుకు బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర

వచ్చే ఎన్నికల్లో తాను నరసరావుపేట నుంచి లోక్‌సభకు పోటీ చేయబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందించారు. ఆ వార్తలు పూర్తిగా సత్యదూరమని, తనకు ఢిల్లీ రాజకీయాలు పడవని పేర్కొన్నారు. తాను తొలి నుంచి జాతీయ రాజకీయాలకు దూరంగానే ఉన్నట్టు చెప్పారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన టీడీపీ ఎక్కడి నుంచి బరిలోకి దిగమంటే అక్కడి నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

తనపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు అందుకు సంబంధించిన ఆధారాలు చూపించాలని కోడెల సవాలు విసిరారు. జగన్‌ను అవినీతి పరుడని పేర్కొన్న బీజేపీ, తెలంగాణలో జగన్‌ను తిరగనిచ్చేది లేదంటూ రాళ్లు వేయించిన టీఆర్ఎస్‌లు కలిసి నేడు  జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు.

ఏపీ-తెలంగాణ మధ్య వివాదాస్పదమైన ‘డేటా యుద్ధం’పై కోడెల మాట్లాడుతూ.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అతిగా స్పందిస్తోందన్నారు. ఇది తెలంగాణకో, లేదంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకో సంబంధించిన విషయం కాదన్నారు. ఈ విషయంలో వైసీపీ వెళ్లి తెలంగాణలో ఫిర్యాదు చేయడమేంటని ప్రశ్నించారు.

More Telugu News