Andhra Pradesh: అప్పుడు ‘ఓటుకు నోటు’ కేసులో దొరికారు.. ఇప్పుడు ‘క్యాష్ ఫర్ ట్వీట్’లో అడ్డంగా బుక్కయ్యారు!: చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్లు

  • తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తున్నారు
  • నకిలీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను ఇందుకు కొనుగోలు చేశారు
  • మీకు ఓటేయాల్సింది ప్రజలేనని గుర్తుపెట్టుకోండి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం గోప్యత చట్టానికి తూట్లు పొడిచిందన్న కేటీఆర్.. మరోసారి ఏపీ సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. టీడీపీ అధినాయకత్వం కొందరు వ్యక్తులకు నగదు చెల్లించి ట్విట్టర్ లో తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోందని మండిపడ్డారు. బోట్స్(ఆటోమేటిక్ గా ట్వీట్లను రీట్వీట్ చేసే సాఫ్ట్ వేర్లు) సాయంతో తమ ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.

కేటీఆర్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘పెయిడ్ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా టీడీపీ అధినాయకత్వం  తెలంగాణ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు యత్నిస్తోంది. చంద్రబాబు గారూ.. మీరు నకిలీ ట్విట్టర్ హ్యాండిల్స్ ను కొనుగోలు చేయవచ్చు. కానీ ఎన్నికల్లో మీకు ఓటేయాల్సింది మాత్రం నిజమైన ప్రజలేనని గుర్తుపెట్టుకోండి. ఓసారి ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు. ఇప్పుడు మళ్లీ క్యాష్ ఫర్ ట్వీట్ వ్యవహారంలో అడ్డంగా దొరికారు’ అని ఎద్దేవా చేశారు. ఈ ట్వీట్ కు ఓ ఆంగ్ల పత్రికలో ప్రచురితమైన కథనాన్ని జతచేశారు.

More Telugu News