Mahesh Babu: మహేశ్ బాబు వాటాగా 50 కోట్లు? .. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్

  • అనిల్ రావిపూడితో మహేశ్ బాబు
  •  నిర్మాతలుగా దిల్ రాజు .. అనిల్ సుంకర
  •  లెక్కల విషయంలో వచ్చిన క్లారిటీ

'మహర్షి' సినిమా షూటింగులో మహేశ్ బాబు బిజీగా వున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు చాలా వరకూ పూర్తయింది. ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి మహేశ్ బాబు రెడీ అవుతున్నాడు. దిల్ రాజు .. అనిల్ సుంకర నిర్మాతలుగా వ్యవహరించనున్న ఈ సినిమా, మహేశ్ బాబు పారితోషికం కాకుండా 50 కోట్లతో నిర్మితం కానున్నట్టుగా సమాచారం.

ఇందుకు సంబంధించిన లెక్కల్లో దర్శకనిర్మాతలకు ఒక క్లారిటీ వచ్చేసిందట. డిజిటల్ .. శాటిలైట్ .. హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మకాల నిమిత్తంగా, పెట్టిన పెట్టుబడి వచ్చేస్తుందని భావిస్తున్నారు. 100 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందనే అంచనాకి వచ్చారట. థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే 100 కోట్లలో నిర్మాతలకి 50 కోట్లు .. షేర్ రూపంలో మహేశ్ బాబుకి 50 కోట్లు దక్కేలా ఒప్పందం చేసుకున్నారని వినికిడి. మహేశ్ బాబు షేర్ గా 50 కోట్లు దక్కనున్న విషయమే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది నిజమే అయితే సరికొత్త రికార్డ్ అవుతుందని అంతా భావిస్తున్నారు. 

More Telugu News