Tamilnadu: అప్పులు తీర్చలేక.. దొంగనోట్లను ముద్రించిన ఎంబీఏ అమ్మాయి.. రూ.2 వేల నోటుతో పట్టుకున్న షాపు యజమాని!

  • యూట్యూబ్ వీడియోల ఆధారంగా ముద్రణ
  • ప్రింటర్ ను కొనుగోలు చేసిన యువతి
  • తమిళనాడులోని కడలూరులో ఘటన

ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పించుకోవడానికి ఓ యువతి అడ్డదారులు తొక్కింది. ఓ ప్రింటర్ ను కొనుగోలు చేసి నకిలీ నోట్లను ముద్రించడం ప్రారంభించింది. నోట్లను ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకోవడానికి యూట్యూబ్ సాయం తీసుకుంది. ఇలా లక్షల్లో దొంగ నోట్లను ముద్రించింది. అయితే ఓ షాపు యజమానికి అనుమానం రావడంతో పోలీసులకు దొరికిపోయింది. దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు, కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన తమిళనాడులోని కడలూరులో చోటుచేసుకుంది.

కడలూరులోని మారియప్ప నగర్ కు చెందిన భరణి కుమారి ఎంబీఏ పూర్తిచేసింది. అయితే ఉద్యోగం రాకపోవడంతో ఇంటివద్దే ఖాళీగా ఉంటోంది. ఈ క్రమంలో కుటుంబ సమస్యల కారణంగా ఆమె చుట్టుపక్కల అప్పులు చేసింది. వాటిని తీర్చలేకపోవడంతో దొంగనోట్లను ముద్రించాలని నిర్ణయానికి వచ్చింది. యూట్యూబ్ లో ఇందుకు సంబంధించిన వీడియోలను చూసిన కుమారి.. ఓ ప్రింటర్ ను కొనుగోలు చేసింది. అనంతరం లక్షల్లో దొంగనోట్లను ముద్రించి కడలూరులో మారుస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో నిన్న కడలూరులోని ఓ షాపుకు వెళ్లిన కుమారి.. కొన్ని వస్తువులను కొనుగోలు చేసి రూ.2 వేల నోటును ఇచ్చింది.

అయితే అది దొంగనోటని షాపు యజమానికి అనుమానం రావడంతో అక్కడి నుంచి వచ్చేసింది. వెంటనే అప్రమత్తమైన షాపు యజమాని పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు చిదంబరం ప్రాంతానికి వెళ్లే బస్సులో ఆమెను గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తాను ఈ నేరానికి పాల్పడినట్లు కుమారి విచారణలో అంగీకరించింది. దీంతో ఆమెను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.

More Telugu News