Andhra Pradesh: అనంతపురంలో రెండుగా చీలిన టీడీపీ.. రోడ్డుపైనే కొట్టుకున్న ఇరువర్గాలు!

  • పల్లె రఘునాథరెడ్డికి టికెట్ ఇవ్వొద్దని ఓ వర్గం ఆందోళన
  • ఘటనాస్థలికి చేరుకున్న పల్లె అనుచరులు
  • రోడ్డుపైనే దాడిచేసుకున్న ఇరువర్గాలు

అసమ్మతి నేతలు వీధులకు ఎక్కి గోల చేయవద్దని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సూచించినప్పటికీ పార్టీ శ్రేణులు మాత్రం మాటవినడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా పుట్టపర్తిలో టీడీపీ రెండుగా చీలిపోయింది. ఏపీ ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వొద్దని టీడీపీకి చెందిన ఓ వర్గం నేతలు ఈరోజు ఆందోళనకు దిగారు. స్థానిక క్రికెట్ స్టేడియం సమీపంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

ఈ విషయం తెలుసుకున్న పల్లె రఘునాథరెడ్డి వర్గీయులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఘర్షణకు దారితీసింది. ఇరువర్గాలు కాలర్లు పట్టుకుని కొట్టుకున్నారు.

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా సూచించారు. అయితే ఇందుకు ఇరువర్గాలు అంగీకరించకపోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

More Telugu News