India: ఐటీ గ్రిడ్, బ్లూ ఫ్రాగ్ కంపెనీల ఓనర్లు ఎప్పుడూ సీఎం చంద్రబాబు పక్కనే ఉంటారు!: వైసీపీ నేత బుగ్గన

  • కోట్లాది మంది సమాచారం బయటకెళ్లిపోయింది
  • ఇది చాలా ప్రమాదకరమైన విషయం
  • హైదరాబాద్ లో మీడియాతో వైసీపీ నేత

ఆంధ్రప్రదేశ్ కు ఏదో జరిగిపోతోందన్నట్లు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కోట్లాది మంది ఏపీ ప్రజల సమాచారం ఆధార్ నంబర్ సహా బయటకు వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇది చాలా ప్రమాదకరమైన విషయమని వ్యాఖ్యానించారు. బ్లూ ఫ్రాగ్, ఐటీ గ్రిడ్ కంపెనీల ఓనర్లు ఎప్పుడు చూసినా చంద్రబాబు వెంటే ఉంటారని దుయ్యబట్టారు. హైదరాబాద్ లోని వైసీపీ కార్యాలయంలో బుగ్గన ఈరోజు మీడియాతో మాట్లాడారు.

ఐటీ గ్రిడ్ సమాచారం చోరీ, ఓట్ల తొలగింపుపై టీడీపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయకుండా సామాన్యుల గురించి ఆలోచించాలని సూచించారు. టీడీపీ అంటే ‘తెలుగు డేటా దొంగలపార్టీ’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

గోప్యత అన్నది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజాసాధికార సర్వే పేరిట ప్రజల సమాచారాన్ని చంద్రబాబు ప్రభుత్వం సేకరించిందన్నారు. అలాగే ఎన్నికల కమిషన్ కు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఓటర్ల జాబితాను సేకరించారని బుగ్గన ఆరోపించారు.

More Telugu News