Love Marriage: ప్రకాశం జిల్లాలో ప్రేమపెళ్లి... వధువు కిడ్నాప్!

  • కాకినాడలో ప్రేమించుకున్న విజయ్, తేజ
  • పెద్దలు అంగీకరించరని గుడిలో పెళ్లి
  • వధువు బంధువులు కిడ్నాప్ చేశారన్న విజయ్

ప్రేమించిన వాడిని కులాంతర వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్ కు గురికాగా, ఆమె కుటుంబీకులే బలవంతంగా తీసుకెళ్లారని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిన ఈ ఘటన వెనుక పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని రమణీయ పేటకు చెందిన డీ విజయ్‌ రంజన్, అదే ప్రాంతానికి చెందిన క్రాంతి తేజలకు బీ ఫార్మసీ చదువుకుంటున్న రోజుల్లో పరిచయం ఏర్పడగా, వారి మధ్య స్నేహం ప్రేమగా మారింది.

అయితే, కులాలు వేరు కావడంతో, పెళ్లికి రెండు కుటుంబాలూ అంగీకరించరని భావించి, గత నెల 22న కంభం ప్రాంతానికి వచ్చి, రాచర్ల మండలం నెమలిగుండ్ల రంగనాయకస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. తమ పెళ్లిని గిద్దలూరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదు చేయించుకుని, కంభంలోనే ఉన్న విజయ్ రంజన్ బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందారు.

ఇక వీరిద్దరూ కంభం ప్రాంతంలో ఉన్నారని తెలుసుకున్న క్రాంతి తేజ కుటుంబీకులు 20 మంది కంభం వచ్చి, వారికోసం గాలిస్తుండగా, తమ జిల్లాకు చెందిన నంబర్ ప్లేట్ తో ఉన్న వాహనం కనిపించింది. దాని వెనుకే వెళ్లిన వారు, విజయ్‌ రంజన్‌ ను గుర్తించారు. ఆపై క్రాంతి తేజను బలవంతంగా తీసుకెళ్లారు. తన భార్యను ఆమె పెదనాన్న, బాబాయి తదితరులు తీసుకెళ్లారని, తన ల్యాప్ టాప్, బంగారు గొలుసు, కెమెరాను తీసుకెళ్లారని విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News