Andhra Pradesh: విజయవాడలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మెడికల్ అకాడమి విద్యార్థి!

  • కానూర్ వికాస్ మెడికల్ అకాడమీలో ఘటన
  • కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నాడన్న అకాడమి నిర్వాహకులు
  • కార్తీక్ స్వస్థలం కడప జిల్లా రాయచోటి అని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లోని  కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని విజయవాడలో ఉన్న కానూర్ వికాస్ మెడికల్ అకాడమిలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక్కడ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ లో చేరిన కార్తీక్ అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తోటి విద్యార్థులు దీన్ని గమనించి తమకు సమాచారం అందించారన్నారు. ఈ విషయమై కార్తీక్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు. కుటుంబ సమస్యల కారణంగానే కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నాడని వ్యాఖ్యానించారు.

మరోవైపు ఈ ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కార్తీక్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. కార్తీక్ స్వస్థలం కడప జిల్లాలోని రాయచోటి అని తెలిపారు. యువకుడి మృతికి కారణమేంటో ఇంకా తమకు తెలియదనీ, దర్యాప్తులో అన్నీ బయటపడతాయని వ్యాఖ్యానించారు. కార్తీక్ తల్లిదండ్రులు స్వస్థలం నుంచి విజయవాడకు బయలుదేరారని పేర్కొన్నారు.

More Telugu News