Andhra Pradesh: నేను కొవ్వూరు నుంచే పోటీ చేస్తా.. టీడీపీలో కొందరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు!: మంత్రి జవహర్ సంచలన ఆరోపణ

  • ప్రధాని అహంకారంతో ప్రవర్తిస్తున్నారు
  • బీజేపీకి ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కదు
  • అమరావతిలో మీడియాతో టీడీపీ నేత

ప్రధాని నరేంద్ర మోదీ అహంకారంతో ప్రవర్తిస్తున్నారని ఏపీ మంత్రి జవహర్ విమర్శించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175 సీట్లలో బీజేపీకి ఒక్క చోట కూడా డిపాజిట్ దక్కదని జోస్యం చెప్పారు. అసలు ఏపీకి ఏ హక్కుతో మోదీ వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో జవహర్ మాట్లాడారు.

కేంద్రం రైల్వేజోన్ పొదుగు ఒడిశాకు, తల ఆంధ్రాకు ఇచ్చిందని దుయ్యబట్టారు. ఏపీ ప్రయోజనాలను కాపాడాకే మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టాలన్నారు. జగన్-కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారనీ, కేటీఆర్ చిలక జోస్యాలు ఇక్కడ పనిచేయవని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో తాను కొవ్వూరు (పశ్చిమ గోదావరి జిల్లా) నుంచే పోటీ చేస్తానని జవహర్ ప్రకటించారు. టీడీపీలో కొందరు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మంత్రి ఆరోపించారు. వీరి సంగతి అధిష్ఠానమే చూసుకుంటుందని స్పష్టం చేశారు.

More Telugu News