Mahabubabad District: రోడ్డు పక్కన ఒంటరి మహిళ.. దోపిడీకి ఇదో మార్గం.. ఆట కట్టించిన పోలీసులు!

  • కనిపించేది ఒకరిద్దరే...వెనుక పెద్ద గ్యాంగే ఉంటుంది
  • వాహనం ఆపగానే దోచుకుంటారు
  • ఎదురు తిరిగితే చితక్కొడతారు

అర్ధరాత్రి ప్రయాణం... అదీ ఒంటరిగా. ఆ సమయంలో ఒంటరి మహిళ ఎక్కడైనా రోడ్డు పక్కన వాహనం కోసం ఎదురు చూస్తున్నట్లు కనిపిస్తే.. మనసు చలించి ఆగారో.. ఇక అంతే! ఈ బలహీనతనే తమ దోపిడీకి సరికొత్త మార్గంగా ఎంచుకుందో ముఠా. మహిళను చూసి వాహనం ఆపిన వారిని నిలువు దోపిడీ చేసి పంపుతోంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి ఓ దోపిడీ దొంగల ముఠా హల్‌చల్‌ చేస్తోంది.

రోడ్డుపై ఓ మహిళను నిలబెడుతుంది. ద్విచక్ర వాహనం, ఫోర్‌వీలర్స్‌, లారీల్లో వచ్చే వారిని ఆ మహిళ ఆపుతుంది. ఆగిన వాహన చోదకుడు ఆశగా ఎక్కడికి? అని అడిగే లోగానే ఓ పెద్దగ్యాంగ్‌ అక్కడ ప్రత్యక్షమవుతుంది. వాహన చోదకుడి వద్ద డబ్బు, నగలు దోచుకుంటుంది. ఎదురు తిరిగిన వారిని చితక్కొట్టి పంపిస్తుంది.

ఆ విధంగానే గత రాత్రి ఓ లారీ డ్రైవర్‌ని ఆపి అతని వద్ద రూ.10 వేలు లాక్కుంది. డ్రైవర్‌, క్లీనర్‌ను చితక్కొట్టి పంపింది. దీన్ని లారీ వెనుక వస్తున్న ఓ కారు డ్రైవర్‌ దూరం నుంచి గమనించాడు. అందుకే అతన్ని కూడా ఈ ముఠా ఆపడానికి ప్రయత్నించినా ఆపకుండా తప్పించుకుని వెళ్లిపోయాడు. అనంతరం స్థానిక పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఈ ముఠా గుట్టు రట్టయింది.

More Telugu News