Andhra Pradesh: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ!

  • మొత్తం 63,804 ఆర్జిత సేవా టికెట్ల విడుదల
  • సుప్రభాత సేవ కింద 7,924 టికెట్లు అందుబాటులోకి
  • కరెంట్ బుకింగ్ కింద మొత్తం 53,675 టికెట్లు

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆన్ లైన్ లో ఈరోజు విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి మొత్తం 63,804 టికెట్లను విడుదల చేసినట్లు టీటీడీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సుప్రభాత సేవ కింద 7,924 టికెట్లు, తోమాల కింద 120, అర్చన కింద 120 టికెట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. అలాగే ఎలక్ట్రానిక్ లాటరీ విధానం కింద 10,129 ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.

అలాగే స్వామివారి అష్టదళ పాదపద్మారాధానకు 240 టికెట్లు, నిజపాద దర్శనం కోసం 1,725 టికెట్లను విడుదల చేశామన్నారు. మొత్తంగా కరెంట్ బుకింగ్ కింద 53,675 ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

ఇక విశేష పూజకు వెయ్యి టికెట్లు, కళ్యాణోత్సవం కింద 13,775 టికెట్లు, ఊంజల్ సేవ కింద 4,350, ఆర్జిత బ్రహ్మోత్సవం కింద 8,250 టికెట్లు, వసంతోత్సవం కింద 7,700 టికెట్లు, సహస్ర దీపాలంకరణ సేవ కింద 18,600 టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ ఉన్నతాధికారి ఒకరు అన్నారు.

More Telugu News