Bhadradri Kothagudem District: తల్లి మరణించిన విషయం చెప్పకుండా కుమార్తెకు వివాహం!

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఘటన
  • పెళ్లికి వస్తుండగా అదుపుతప్పిన కారు
  • విషయం దాచి వివాహం జరిపించిన బంధువులు

మరికాసేపట్లో కన్నకూతురి వివాహాన్ని కళ్లారా చూడాల్సిన ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడగా, ఆ విషయాన్ని దాచిపెట్టిన బంధుమిత్రులు, పెళ్లి తతంగాన్ని ముగించిన తరువాతే విషయం చెప్పారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో చోటు చేసుకోగా, మూడు ముళ్లు పడగానే తల్లి మరణ వార్త తెలుసుకున్న నవ వధువు, మృతదేహం ముందు బోరున విలపిస్తుంటే ఎవరూ ఓదార్చలేకపోయారు.

మరిన్ని వివరాల్లోకి వెళితే, బుడుగు బజారుకు చెందిన కటుకూరి నాగేంద్ర (48) భర్త గతంలోనే చనిపోగా, అన్నీ తానై కుమార్తె ప్రవీణను పెంచి పెద్ద చేసింది. ప్రవీణకు గురువారం తెల్లవారుజామున మొండికుంటకు చెందిన యువకుడితో వివాహం జరిపించేందుకు పెద్దలు నిశ్చయించగా, వధువు, బంధువులు రాత్రి 11.30 గంటలకు అశ్వాపురం నుంచి కార్లలో బయల్దేరారు.

వీరి కార్లు ముందుగానే వివాహ మండపానికి చేరుకోగా, వధువు తల్లి, ఇతర బంధువులు ప్రయాణిస్తున్న కారు చింతిర్యాల అడ్డరోడ్డు వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో వధువు తల్లికి తీవ్రగాయాలు కాగా, ఆసుపత్రికి తరలిస్తుండగానే ఆమె మృతి చెందింది. విషయం కుమార్తెకు చెబితే, ఆమె పెళ్లికి అంగీకరించబోదని భావించిన బంధువులు, ప్రవీణ వివాహాన్ని జరిపించారు.

More Telugu News