Telangana: ఈటల రాజేందర్ గాంధీ ఆసుపత్రికి రావాలి.. లేదంటే ఎమర్జెన్సీ సేవలను నిలిపివేస్తాం!: జూనియర్ డాక్టర్ల వార్నింగ్

  • గాంధీ ఆసుపత్రిలో నిన్న జూనియర్ డాక్టర్ పై దాడి
  • రోగుల బంధువుల తీరుకు నిరసగా జూడాల ఆందోళన
  • గాంధీ ఆసుపత్రిలోనే చర్చలు జరపాలని డిమాండ్

హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు(జూడాలు) ఈరోజు ఆందోళనకు దిగారు. రోగుల బంధువులు తమపై దాడిచేయకుండా రక్షణ కల్పించాలని కోరుతూ ధర్నాకు దిగారు. ఈ విషయంలో తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్వయంగా వచ్చి తమతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ఆసుపత్రిలో అత్యవసర సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు.

ఈ విషయమై జూనియర్ డాక్టర్ ఒకరు మాట్లాడుతూ.. తమ ఆందోళనపై ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని, తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ ఆసుపత్రికి వచ్చి తమతో చర్చలు జరపాలని అన్నారు. కొందరు వ్యక్తులు నిన్న ఓ జూనియర్ డాక్టర్ పై గాంధీ ఆసుపత్రిలో దాడి చేశారన్నారు.

తమ విధినిర్వహణ సమయం ముగిసినా ఆసుపత్రిలో ఉండి సేవలు అందిస్తున్నామనీ, అయినా తమపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎక్కువ మందిని లోనికి అనుమతించరనీ, కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల బంధువులను అనుమతించడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. తమకు ప్రశాంతమైన వాతావరణం కల్పించినప్పుడే రోగులకు తాము న్యాయం చేయగలమన్నారు.

More Telugu News